స వెం రమేష్ గారి 'ఉత్తర పొద్దు' - 'ప్రళయకావేరి కథలు' సంకలనం నుంచి
Harshaneeyam - A podcast by Harshaneeyam

‘ప్రళయ కావేరి కథలు’ పుస్తకం కొనాలంటే - https://bit.ly/2TXhEubఉత్తర పొద్దు :మా ఊరిని ఆనుకొనే ఉంది. ప్రళయకావేరి. సుమారు ముప్పై మైళ్ల పొడవు .. పది మైళ్ల వెడల్పు ఉన్న సరస్సు అది. ప్రళయ కావేట్లో నలభై వరకూ దీవులు న్నాయి. వాటికి రకరకాల పేర్లు. వాటిల్లో కొన్ని దీవుల్లో మాకు చుట్టాలున్నారు.ఆ దీవుల్లో ఒకటి 'జల్లల దొరవు.' విసిరేసినట్లు ఒక మూలగా ప్రళయకావేరి ఒడిలో ఒదిగి ఉండేది. ఆ దీవిలో నాకు వరసకు మామ ఒకాయన ఉండేవాడు. వాళ్లింటికీ మా ఇంటికీ రాకపోకలు ఉండేవి. నేను కూడా అప్పుడప్పుడూ అక్కడకు పోతుండేవాడిని.జల్లల దొరువు ప్రయాణమంటే చిన్న విషయం కాదు. తెల్లవారి అయిదు గంటలకు మొదలుపెడితే రాత్రి ఏడుకో, ఎనిమిదికో ఆ దీవికి చేరేవాళ్లం. అంటే ఒక పగలంతా ప్రయాణమే. కాసేపు నీళ్లల్లో నడిచి కాసేపు దీవుల్లో నడిచి ఒక దీవి నుంచి ఇంకో దీవిని దాటి చేరుకోవాలి. ఇంతా చేసి మా ఊరికి, జల్లల దొరువుకి నడుమ దూరం పాతిక కిలోమీటర్లలోపే.ప్రళయకావేట్లో ప్రయాణం ఒక వింత అనుభూతి. నడిచి నడిచి కాళ్లు పీకుతున్నా, ఇంకా నడవాలనే మనసు పీకుతుంటుంది. ఎండా, వానా, మంచు.... ఇవన్నీ కాలానికి అనుగుణంగా సరస్సులో ఎరగనన్ని వన్నెలు చూపించేవి. మా ప్రయాణం ముచ్చట్లు మొదలు పెడితే మీకూ తెలుస్తాయి ఆ వన్నెచిన్నెలు.ఒకసారి నేనూ, మా వెంకటన్న, నా నేస్తాలు శీనయ్య, చెంగయ్య నలుగురం ప్రయాణం కట్టినాము ప్రళయకావేరిలో, శీనయ్య, చెంగయ్యలు 'రాగన్న పట్టెడ'కు, నేనూ, మా అన్న జల్లల దొరువుకు. అప్పుడు నా వయస్సు పన్నెండో, పదమూడో ఉండొచ్చు. అప్పటికి ఉత్తరకార్తె పెట్టి రెండు దినాలయింది. ఆ ఏడాది మఖ, పుబ్బల్లోనే గట్టి వానలు పడినాయి. అందుకే మా అమ్మకూ, మా అవ్వకూ మా ప్రయాణమంటే దిగులు.'దార్లో వానొస్తే 'రాగన్నపట్టెడ'లోనే నిలిచిపోండి. ఉత్తరపొద్దులో కావేట్లో దిగబాకండి' మా అమ్మ హెచ్చరించింది.'ఉత్తరపొద్దంటే వాళ్లకేం తెలుస్తాదమ్మే' అని మాయమ్మని ఒక్క కసురు కసిరింది మా అవ్వ.మావైపు తిరిగి 'నాయినా ! మద్దినేళ మడకలిప్పే పొద్దులో పెళయకావేట్లో నడవబాకండ్రా' అనింది. 'పునమాల తిప్ప దాటినాక, చిన్నతోటకు పొయ్యే దాకా దిగులుతిప్పలెక్కువ. చూసి నడవండి' మా పెద్దమ్మ సలహా ఇచ్చింది. 'దిగులుతిప్ప' అంటే ఒక రకమైన బురదగుంట. ఊబి కాదు. ఇందులోకి దిగితే నడుములదాకా కూరుకుపోతాము.'ఉత్తరపొద్దు బిడ్డల్ని ఏమారస్తాదేమో' మా అమ్మ గొణగసాగింది.ఆడవాళ్ల సణుగుడంతా విన్న మా తాత లేచి, 'మేయ్! గమ్మునుంటారా? లేదా? అయినా పంట రంగస్వామి లేదా. ఏదన్నా అయితే చూసుకొనేదానికి. పోయిరానీ వాళ్లని' అన్నాడు.మా వైపు చూసి, 'అబయా. నలగామూల దాటినాక పెళయకావేరమ్మకు సక్కలగిలెక్కువ. మునేళ్లు అదిమి పెట్టి నడవండి. లేకపోతే గెబ్బిడు గెబ్బిడు ఎంట్ర కాయల్ని జవరాల్సిపడతాది' అన్నాడు. అంటే నలగామూల దగ్గర జారుడు ఎక్కువ. జాగ్రత్తగా నడవకపోతే పడతామని చెప్పడం. అప్పటికి మా పల్లెల్లో తమదల (రాగుల) వాడకం ఇంకా ఉంది. చిక్కటి మజిగ కలిపిన గట్టి అంబలిని స్టీలు టిఫిన్లో పోసిచ్చినారు. అట్లే రెండు పులుసన్నం పొట్లాలు కట్టిచ్చినారు. తెల్లవారి ఆరుగంటలకు 'అటకానితిప్ప'కు పొయ్యే బస్సు ఎక్కి కూచున్నాము. బస్సు బయల్దేరి కసారెడ్డిపాళెం, చెరువుకండ్రిగ, దావాది గుంటలు దాటి కుదిరికి వచ్చింది. కుదిరి వస్తే మా ఆనందం ఎక్కువవుతుంది. కదిరి దాటగానే ప్రళయ కావేరి మొదలవుతుంది. ఇక కనుచూపు మేరా నీలాలు ఆరబోసినట్లు నీళ్లు.ప్రయాణించి 'అటకానితిప్ప'లో మమ్మల్ని దించింది, బస్సు. కావేరిలోని దీవులకు కేంద్రం 'అటకానితిప్ప 'దీవి. దీవులలో ఉండేవాళ్ళు ఆ పేటకు (మా ఊరికి) రావాలంటే 'అటకాని తిప్ప'కు వచ్చే బస్సు ఎక్కాలి.మూడునాళ్లుగా ముసురుపట్టిన మబ్బుల చాటు నుంచి సూర్యుడు తొంగి తొంగి చూస్తున్నాడు. అటకాని తిప్పలోని వినాయకుడి గుడి దగ్గరకు పోయి తెచ్చుకొన్న అంబలిలో కొంచెం తాగినాము. ..'ఏ ఊరికి సిన్నా?' ఒక ముసలాయన అడిగి నాడు. 'మేము జల్లల దొరువుకీ, వీళ్లు రాగన్నపట్టెడకీ' ఇద్దరి తరపునా నేనే చెప్పినాను. 'జల్లల దొరువా ! నాయినా దూరాబారం బొయ్యేవోళ్లు. బిన్నా బయల్దేరండి. తూరుపుగాలి మళ్లింది. వానొస్తాదేమో! ఇప్పుడు పెళయకావేట్లో దిగితేగానీ సద్దికూటేళ్లకు 'కొరిడి'కి పోలేరు. ఉత్తరపొద్దులో యాడ్నో ఒక దెగ్గిర నిలబడిపోండి' అన్నాడా ముసలాయన.మేము ఆ మాటతో దెబగుబా ప్రళయకావేట్లో దిగినాము. తూరుపు నుంచి చల్లగాలీ లేత ఎండా కలిసి మమ్మల్ని గిలిగింతలు పెడుతున్నాయి. వానలు బాగా పడి సరస్సంతా నిండుగా ఉంది. అడుసు మీగాళ్లనూ, నీళ్లు మోకాళ్లనూ దాటుతున్నాయి. వలసపక్షులు కూడా కొంచెం ముందుగానే వచ్చినట్లుండాయి....