‘చిలుకంబడు దధికైవడి’ కథాసమీక్ష - ఉణుదుర్తి సుధాకర్ గారు
Harshaneeyam - A podcast by Harshaneeyam

‘చిలుకంబడు దధికైవడి’ అనే కథకు మూలం, రచయిత జెయమోహన్ రాసిన ‘మత్తుఱు తయిర్’ (Mathuru thayir Jayamohan | மத்துறு தயிர் ஜெயமோகன்) అనే కథ, ‘అఱం’ అనే కథాసంకలనం లోనిది. ఈ కథను ప్రముఖ కథా రచయిత శ్రీ ఉణుదుర్తి సుధాకర్ గారు ఈ ఎపిసోడ్ లో సమీక్షిస్తారు. వారికి కృతజ్ఞతలు. ఈ కథకు మూలం ప్రముఖ తమిళ రచయిత జెయమోహన్ రాసిన ‘మత్తుఱు తయిర్’ (Mathuru thayir Jayamohan | மத்துறு தயிர் ஜெயமோகன்) అనే కథ. జెయమోహన్ గారి ‘అఱం’ అనే కథాసంకలనం లోనిది. ‘అఱం’ లోని పన్నెండు కథలు, నిజ జీవితంలోని ప్రత్యేకమైన, ప్రసిద్ధమైన వ్యక్తుల గురించి మనకు చెబుతూ రచయిత రాసిన కథలు. ఈ కథలోని ముఖ్య పాత్ర , తిరువనంతపురం విశ్వవిద్యాలయ ఆచార్యుడుగా తమిళ సాహిత్యాన్ని బోధించిన ప్రొఫెసర్ జేసుదాసన్. కన్యాకుమారి జిల్లాలో ఒక నీరుపేద కుటుంబంలో జన్మించారు. ‘కంబ రామాయణం’ విస్తృతంగా అధ్యయనం చేసి, అందులోని కవితా సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ వేలాది విద్యార్థులను తన ఉపన్యాసాలతో అపరిమితంగా ప్రభావితం చేసి, వారిని సాహిత్యం వైపు మళ్ళించారు. తమిళ సాహితీ విమర్శకుడిగా కూడా ఎంతో పేరు గడించిన ప్రొఫెసర్ జేసుదాసన్ 2002 వ సంవత్సరంలో మరణించారు. రామాయణంలోని సీతారాముల మధ్య వియోగాన్ని కంబ రామాయణం లోని పద్యాల ద్వారా మనకు వివరిస్తూ, వర్ణిస్తూ, తద్వారా గురు శిష్యుల మధ్య సంబంధాన్ని గొప్పగా ఆవిష్కరించిన కథ ఇది. *ఈ కథలో ప్రస్తావించబడ్డ పద్యాలు పూతలపట్టు శ్రీరాములురెడ్డి గారు తెనిగించిన ‘కంబ రామాయణం’ లోనివి. ‘చిలుకంబడు దధికైవడి’ -“నువ్విక్కడుండి చేసేదేవుంది? బండెక్కు!” అన్నాడు కుమార్, ప్రొఫెసర్ని సభకు తీసుక రావడానికి బయలుదేరుతూ. “అరుణ కూడా వస్తానంది! ఆమె కోసం చూస్తున్నాను” అంటూ నసిగాను. “బావుంది.ఎదురెళ్ళి హారతి ఇస్తావా ఏంటి? భార్య, అంటే ‘ప్రేమ’ ఉండాలి కానీ ‘ఇంత’ అవసరం లేదేమో?” అంటూ వాన్ తలుపు తెరిచాడు కుమార్. “ఇలాంటి సమావేశాలకు వచ్చినప్పుడు, ప్రొఫెసర్ మాంఛి ఊపులో ఉంటాడు. అపుడు ఆయన మాట్లాడుతూంటే వినడం ఓ గొప్ప అనుభవం. నువ్వావకాశం కోల్పోడం నాకిష్టం లేదు. చూస్తావుగా? ” అన్నాడు బండి నడుపుతూ కుమార్. “ వాళ్ళావిడ కూడా హల్లెలూయా అనుకుంటూ పక్కనే వుంటారేమో” అన్నా నేను. “లేదు…లేదు. ఆవిడ స్టీఫెన్ కార్లో వస్తున్నారు. వాన్లో ఎక్కితే కళ్ళు తిరుగుతాయంది. సరే అంబాసిడర్ లో రండి, దాంట్లో అయితే ఇబ్బంది ఉండదు అని చెప్పాను. ప్రొఫెసర్ తో మాట్లాడేటప్పుడు మటుకు - సంభాషణని తెలివిగా కంబ రామాయణం మీదికి మళ్ళించే బాధ్యత నీదే! మధ్యలో పొరపాటున బైబిలని కానీ ప్రభువా! అని కానీ అన్నావో… అంతా వేరే దార్లో కెళ్ళిపోతుంది.” నింపాదిగా చెప్పుకుపోతున్నాడు కుమార్.“ఇప్పుడు మూడేగా. సభ మొదలయ్యేది ఆరుగంటలకు కదా?” అన్నాను. “నన్నడిగితే ఇప్పటికే ఆలస్యం అయ్యింది అంటాను. కాలాలు, వాటికి సంబంధించిన పరిమితులు.. వీటన్నిటికీ అతీతుడు ఆయన. ఇది పొద్దునా, రాత్రా, అనే స్పృహ కొంచెం కూడా ఉండదు. ఈ పాటికే ఊళ్ళో వుండే దిక్కుమాలిన సంతంతా ఆయన చుట్టూ చేరి, పోచుకోలు కబుర్లలో దింపేసుంటారు. ఈ మహాత్ముడు చిన్న పిల్లాడిలా వాళ్ళకు తన చెవులు అప్పగించి, వింటూ ఉంటాడు. వెళ్ళగానే ఆయనకు స్నానం చేయించి, లాల్చీ, పంచె తగిలించి, తీసుకవెళ్ళాల్సి ఉంటుంది.”“స్నానం కూడా చేయించాలా?” నవ్వాను నేను. “అలానే ఉండబోయేట్టుంది!”కారు పున్నైవనం దగ్గర, కుడివైపుకు తిరిగింది.