తిలక్ గారి 'దేవుణ్ణి చూసిన మనిషి'

Harshaneeyam - A podcast by Harshaneeyam

Categories:

తెలుగు వచనా కవిత్వాన్ని తన అద్భుతమైన ప్రతిభతో ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిన కవి, శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్. అతి చిన్న వయసులో , యాభై సంవత్సరాలు కూడా నిండకుండా అయన మరణించడం తెలుగు వారి దురదృష్టం.తిలక్ గారి మరణానంతరం 1968లో ముద్రణ పొందిన తిలక్ కవితల సంపుటి ' అమృతం కురిసిన రాత్రి ' ఉత్తమ కవితాసంపుటిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1971 లో పొందింది.ఇదిగాక ఆయన కొన్ని అద్భుతమైన కథలను రచించారు.ఇప్పుడు వినబోయే కథ 'దేవుణ్ణి చూసిన మనిషి' - 'తిలక్ కథలు' అనే సంకలనం నుంచి. ఈ పుస్తకాన్ని నవచేతన వారు పబ్లిష్ చెయ్యడం జరిగింది.తిలక్ గారి కథలు ఆడియో రూపంలో మీకందించటానికి అనుమతినిచ్చిన శ్రీ మధుకర్ గారికి, హర్షణీయం తరఫున హృదయ పూర్వక కృతజ్ఞతలు.ఈ పుస్తకం మీరు కోనేటందుకు కావలసిన వివరాలు , ఇదే వెబ్ పేజీ లో ఇవ్వటం జరిగింది.కథ:గవరయ్య పెళ్ళాం లేచిపోయిందన్న వార్త ఊరు ఊరంతా ఉత్సాహంగా వ్యాపించింది. అంతకుముందు రోజునే చైనా ఇండియా సరిహద్దులలో దురాక్రమణ చేసిందనీ, యుద్ధం జరుగుతూన్నదనీ వచ్చిన వార్త చటుక్కున అప్రధానమైపోయి అందరూ మరచిపోయారు కూడా. ఆడది లేచిపోవడంలోని విశిష్టతని ఈ వూరువారొక్కరే గుర్తించారా అనిపిస్తుంది. యింత తెలుగు దేశంలోనూ!రోడ్ల కూడలిలో, కాఫీ హోటలులో (ఆవూళ్ళో ఒకటే వుంది) పొలంగట్లనీ, పంచాయితీ బిల్డింగ్ దగ్గరా పురుషులూ; పెరటి గోడల దగ్గరా, బావులూ, నీలాటి రేవుల దగ్గరా ఆడవాళ్ళూ ఈ విషయాన్నే చిత్ర విచిత్రంగా చెప్పుకుంటున్నారు. వట్టి లేచిపోవడమే అయితే యింత సంచలనం కలిగించకపోను; అందులోనూ ఎందుకూ పనికిరాని ఎదురింటి అరుగుమీది మిషన్ కుట్టుపనివాడితో లేచిపోవడమే మరీ విడ్డూరంగా వుంది. ఇంతకన్న మరో ఏ పెద్దమనిషితో లేచిపోయినా యింత అప్రదిష్ట ఉండకపోనని వూళ్ళో అనుభవజ్ఞులైన పెద్దలు అనుకున్నారు. చాలామంది యువకులు గవరయ్య భార్య తమని నిష్కారణంగా అవమానించినట్టూ అన్యాయం చేసినట్టూ బాధపడ్డారు.“వాడిలో ఏం చూసి లేచిపోయిందత్తా” అని మూడోసారి అడిగింది తన అత్తని ఒక పడుచు తన కుతూహలం ఆపుకోలేక.“పోనీ నువ్వే వాడితో లేచి పోకపోయావూ నీకు తెలిసొచ్చును” అంది అత్తగారు విసుగుతో, కోపంతో.“గవరయ్యకి బాగా శాస్త్రి అయింది” అని ఏకగ్రీవంగా ఆబాల గోపాలమూ తీర్మానించారు. గవరయ్యను చూసి జాలిపడినవాడూ సానుభూతి తెలిపినవాడూ ఒక్కడు లేడు.గవరయ్య అంటే ఆ వూళ్ళో అందరికీ అసహ్యం. మనిషి కూడా నల్లగా ఎగుడుదిగుడుగా వుంటాడు. మొహంమీద స్ఫోటకం మచ్చలు, పెదాలు లావుగామోటుగా వుంటాయి. కనుబొమ్మలు గుబురుగా గొంగళీ పురుగులు అతికించినట్లు వుంటాయి. ఊరికి శివారున వున్న పెద్ద పెంకుటింటి లోగిలిలో గవరయ్య వుంటాడు.“నాకు తెలుసును ఇలాంటిదేదో జరుగుతుందని” అన్నాడు కన్నులరమూసి అవధాని. అవధాని ఆ వూళ్ళో ధర్మకర్త.మునసబు చలపతి, కరణం నరసింహమూ తల వూపారు. దాంతో మరికాస్త ఉత్సాహంతో ఉపనిషద్వాక్యంలాంటి పై వాక్యానికీ వ్యాఖ్యానం చెప్పాడు ధర్మకర్త.“వేణుగోపాలస్వామి వూరికే పోనిస్తాడా? ప్రథమ కళత్రం చావనే చచ్చింది. ఇంక ఈ రెండో ఆవిడ చావుకన్న ఘోరమైన పని చేసి వూరుకుంది. ఒక్క ధర్మకార్యం చేశాడా? ఒక్క మంచిమాట చెవిని పెట్టాడా?”మున్సబు చలపతి చేతికర్రను నేలమీద తాటించి అన్నాడు “ఒక్కరిని దగ్గరకు రానిచ్చాడా? కర్కోటకుడండీ యీ గురవయ్య. ఎంత అహం, ఎంత పొగరు....”“పాపపు సొమ్మండీ పాపిష్టి ఆర్జితం! దాని ఫలితం వూరికే పోతుందా? మొన్న కుర్రాళ్ళందరూ వెళ్ళి భజన చందాకి ఒక్క రూపాయి _ ఒబ్బు రూపాయి యిమ్మంటే తరిమి కొట్టాడుట...” అన్నాడు కరణం.గవరయ్య యిరవై ఏళ్ళ క్రితం ఇరవై ఏళ్ళవాడు ఈ వూరొచ్చాడు. ఈ వూళ్ళో అతనికో మేనత్త వుంది. తల్లీ తండ్రి లేని అతను యీ మేనత్త దగ్గరకు వచ్చిపడ్డాడు. వస్తూనే కొంత డబ్బుకూడా తీసుకుని వచ్చాడు. ఈ వూరికి రెండు మైళ్ళ దూరంలోనే టౌను వుంది. రోజూ ఉదయమే టౌన్ కి వెళ్ళి చీకటి పడ్డాక తిరిగొచ్చేవాడు. కొన్నాళ్ళకి తోళ్ళ వ్యాపారం చేస్తున్నాడని తెలిసి అందరూ “హరీ హరీ” అని చెవులు మూసుకున్నారు. మేనత్తతో యిది చాలా పాపమనీ బెడిసికొడుతూందని చెప్పారు. కానీ మేనత్త ఏమీ...