Part 1 - ‘వఱడు ‘ – అల్లం శేషగిరిరావు గారు
Harshaneeyam - A podcast by Harshaneeyam

‘వఱడు ‘ – అల్లం శేషగిరిరావు గారి ‘అరణ్య ఘోష’ కథాసంకలనం లోనిది.పొలిటికల్ సైన్స్ లో ఎం ఏ పట్టా పుచ్చుకున్న అల్లం శేషగిరి రావు గారు, రైల్వేస్ లో పని చేసి రిటైర్ అయ్యారు. విశాఖపట్నం లో నివసించారు. ఆంగ్ల సాహిత్యంలోని అనేక ప్రసిద్ధ రచయితల రచనలను ఆయన ఇష్టంగా చదువుకున్నారు.బాల్యం ఒరిస్సా లోని ఛత్రపురంలో గడిచింది. చుట్టుపక్కల ఎక్కువ అటవీ ప్రాంతం.ఆయన తన పదమూడవ ఏటినించీ, స్నేహితులతో , ఇంట్లో వారితో కలిసి, వేటకు వెళ్లడం అడవుల్లో చాలా సమయాన్ని గడపడం జరిగింది.అటవీ నేపథ్యంలోనే ఎక్కువ శాతం కథలు రాసారు. రాసిన పదిహేడు కథల్లో సమాజంలో వుండే అసమానతలూ, అట్టడుగు వర్గాల జీవితాలపై విశ్లేషణ, ముఖ్య ఇతివృత్తాలుగా , మనకు కనిపిస్తాయి.కథల్లో ప్రకృతిని వర్ణించేటప్పుడు ఆయనకున్న పరిశీలనా జ్ఞానం , భావుకత్వం మనల్ని కట్టి పడేస్తాయి.1981 లో ఆయన ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి పురస్కారం లభించింది.*** కథను ప్రచురింపడానికి అనుమతినిచ్చిన శ్రీమతి మాధవి, శ్రీ రఘునాథ్ అల్లం గార్లకు కృతజ్ఞతలు.కథను ‘గానా’ (Ganaa) ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1(Harshaneeyam on Gaana app)స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam(Harshaneeyam on Spotify)ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5(Harshaneeyam on Apple. Podcast)వఱడు :రాత్రి పదిగంటలు కావస్తోంది. ఆ కీకారణ్యమంతటా పేరుకున్న నల్లటి జారు ముద్దలాంటి చీకటి అలుముకునుంది. కేంపు గూడారాలు మాత్రం తెల్ల తెల్లగా కనిపిస్తున్నాయ్. మధ్యలో అక్కడక్కడ కేంపు పనివాళ్ళు వన్య మృగాల బారినుండి రక్షించుకోడానికి వేసిన మంటలు, దూరాన్నించి కొరివి దెయ్యాల్లా కన్పిస్తున్నాయ్. గుడారాల్లో హరికెన్ లాంతర్లు మిణుకు మిణుకు మంటూంటే, ఆఫీసు టెంటుల్లో పెట్రోమాక్సు లైటు వెలిగిపోతోంది. దశరధరామయ్య గారు ఇంకా ఆఫీసు పనిచేసుకుంటున్నారు. అలా రాత్రి ఒంటి గంట వరకూ ప్రతిరోజూ పని చెయ్యడం ఆయనకి పరిపాటే. –చిమ్మెట్టలు “జూయ్ “మనిచేసే శబ్దం తప్ప అంతా నిశ్శబ్దంగా వుంది. ఎక్కడో దూరంగా కొండల్లో కొండ గొర్రె అవిరామంగా “కార్ కార్ “మని అరుస్తోంది. దశరధ రామయ్యగారికి చిన్న దగ్గుతెర వచ్చింది. కాస్సేపు గొంతుకలో కఫం తగ్గేదాకా దగ్గి, గుండెని చేత్తో పట్టుకుని టెంటు తెర తొలగించి బైటకొచ్చి తుపుక్కున ఉమ్మాడు. ఆయాసం కాస్త తేలికపడిన తరవాత, ఇహ ఇవాల్టికి ఇంటికి పోదామనుకున్నాడు. – కానీ ఇంకా బోలెడు పనుండి పోయింది. ఐనా ఇప్పుడు టైము ఎంత అయుంటుందో అని చిన్నయ్య గుడారం వైపు చూశాడు.జీపు డ్రైవరు చిన్నయ్య హెడ్ క్వార్టర్సులో వుంటే, సరిగ్గా రాత్రి పన్నెండు గంటలకు ఎన్ని పనులున్నా లైటార్పేసి పడుకుంటాడు. అది అతని ఎక్సు మిలిటరీ డిసిప్లేన్ అంటాడు.ఇంకా లాంతరు గుడారంలో వెలుగుతోంది. అంటే పన్నెండు కాలేదన్నమాట. సరే మరో గంట పనిచేసి పోదామని టెంటు లోకి దశరధరామయ్యగారు దూరుతుండగా “ఠకాలు”మని బూట్లు కొట్టుకున్న చప్పుడు, వెంటనే “గుడ్ నైట్ పంతులు బాబూ” అనే అరుపుకూడా వినిపించింది. అకస్మాత్తుగా మిలిట్రీ కాషన్ లాంటి అరుపు వినపడగానే ఉలిక్కి పడినా, అది చిన్నయ్య కేకే అని పోల్పేసుకున్నాడు. “ఆఁ రావయ్యా! నిద్రపోలా!” అని పలకరించాడు. తన గుడారం ముందు అటెన్షన్ ఫోజులో సెల్యూట్ చేస్తూ నిలబడ్డాడు చిన్నయ్య,“రాత్రుళ్ళు కూడా నీ మిలిటీ సెల్యూట్లేనా మిలిట్రీ వదిలేసినా, ఇంకా ఆ డ్రెసులూ వీశడు బరువు బూట్లు, మిలిటీ సెల్యూట్లూ మానవు గదా….. రావయ్యా!…… భోంచేశావా?” అనడిగాడు దశరధరామయ్య..“ఇప్పుడే అయింది బాబూ, చుట్ట కాల్చుకుందామని బైటికొచ్చాను. మీరింకా పని చేస్తున్నారా? అసలే మీ హెల్తు మంచిదికాదు. ఉబ్బసపోళ్ళు. ఈ చలికాలం...